12-05-2025 02:05:56 AM
లక్నో, మే 11: ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం ఉపేక్షించదని, రానున్న రోజుల్లో దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించి తీరుతామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. లఖ్నోలో సోమవారం ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్తో కలిసి ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు.
కేవలం 40 నెలల్లోనే క్షిపణి ఉత్పత్తి యూనిట్ను నెలకొల్పి, యూనిట్ను అందుబాటు లోకి తీసుకువస్తున్న యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన ఆయుధ సంపత్తి శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పామని తెలిపారు. భారత సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని పేర్కొన్నారు.
పహల్గాంలో ఉగ్రదాడికి ఇది సరైన సమాధానమని చెప్పుకొచ్చారు. భారత్ ఎప్పటికీ ఉగ్రవాదాన్ని సహించదని, ఉగ్రవాద నిర్మూలన కోసం ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకుంటామని ప్రకటించారు. భారత్ ఎప్పుడూ పాక్ పౌరులపై దాడులు చేయలేదని, కానీ.. పాక్ మాత్రం ఎన్నోసార్లు భారత పౌరులపై దాడులకు పాల్పడిందని గుర్తుచేశారు.
పహల్గాం దాడుల తర్వాత భారత్ ఏకంగా పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిందని, దాడులతో సు మారు 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిందని తెలిపారు. ఆ తర్వాత భారత్పై పాక్ దాడులకు దిగిందని, వాటన్నింటిని కూడా తాము సమర్థంగా తిప్పికొట్టామని వెల్లడించారు.
భారత్ నిర్ణయాలను పహ ల్గాం బాధిత కుటుంబాలు స్వాగతించాయని, అపరేషన్ సిందూర్తో ఆయా కు టుంబాలకు న్యాయం చేశామన్నారు. ఆపరేషన్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణి శక్తిని యావత్ ప్రపంచానికి తెలియజేశామన్నారు. యురి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత భారత సైన్యం తీవ్రంగా స్పందించిందని, ఉగ్రవాదుల దాడులకు ప్రతిగా దీటైన జవాబు ఇచ్చామని గుర్తుచేశారు.
‘బ్రహ్మోస్’ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాం: యూపీ సీఎం యోగి
భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణుల శక్తి ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసిందని, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే పాకిస్థాన్ను అడిగి తెలుసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ చమత్కరిం చారు.
ఉగ్రవాదుల తీరు‘కుక్క తోక వంకర’ అన్న చందంగా ఉంటుందని, వారికి వారి భాషలోనే సమాధానం ఇస్తేనే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాదుల దాడులను ఉపేక్షించదని, ఉగ్రవాదులపై ఉక్కుపా దం మోపుతుందని స్పష్టం చేశారు.