19-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
గార్ల, ఆగస్టు 18 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని తులారం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి ఇబ్బంది తీరుస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. సోమవారం బిఎన్ గుప్తా తులారం ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో చిన్న నీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, పెద్ద ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకోవడం జరిగిందని ఆరోపించారు. త్వరలో ప్రభుత్వానికి తులారం ప్రాజెక్టు అభివృద్ధి విషయంపై నివేదించి మానుకోట, ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు సాగునీటి, తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.