14-08-2025 01:19:35 AM
- విల్లు లేకుండా 30 వేల కోట్ల ఆస్తి
- జూన్లో హఠాత్తుగా మరణించిన బిలియనీర్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోనా గ్రూప్ అధినేత సంజయ్ కపూర్ (53) జూన్లో హఠాత్తుగా మరణించారు. ‘సోనా కామ్స్టార్’ అనే కంపెనీని స్థాపించిన సంజయ్ కపూర్ పేర దాదాపు రూ. 30 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చిన్న వయసులోనే హఠాత్తుగా మరణించడంతో ఆయన ఆ ఆస్తులకు ఎవరినీ వారసులుగా ప్రకటించలేదు. దీంతో సంజయ్ కపూర్ కుటుంబంలో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.
సంజయ్ కపూర్ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యానికి ఎవరు అధిపతి అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, ఆయన భార్య ప్రియా సచ్దేవ్ కపూర్, ఆయన చెల్లెళ్లు, మాజీ భార్యల పేర్ల మీద కూడా ఎటువంటి వీలునామా లేకపోవడం గమనార్హం. ఆయన స్థాపించిన సోనా గ్రూప్ను హస్తగతం చేసుకునేందుకు ఇప్పుడు ఆయన కుటుంబీకులు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
హిందూ చట్టాలు ఏం చెబుతున్నాయంటే
ఎవరైనా హిందూ వ్యక్తి విల్లు లేకుండా మరణిస్తే ఆయన సర్వదాస్తి ఆయన వారసులకు సమాన వాటాలో చెందుతుందని హిందూ వారసత్వ చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న భార్యకు కలిగిన అందరు సంతానం, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న సంతానం, ఆ వ్యక్తి తల్లి మొదలైన వారు ఉంటారు.
బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు..
కొడుకు చనిపోయిన బాధలో తాను ఉండగా.. కొంత మంది వచ్చి తనతో కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టించుకుని వెళ్లారని సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనా కంపెనీ వార్షిక సమావేశాన్ని కూడా నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అయినా కానీ కంపెనీ వార్షిక సమావేశం నిర్వహించారు. సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ కపూర్ను జూలై 225 2005న జరిగిన వార్షిక సమావేశంలో నాన్ డైరెక్టర్గా నియమించారు. రాణికపూర్ 2019 నుంచే షేర్ హోల్డర్ కాదని కంపెనీ తరఫున ప్రకటించారు. సంజయ్ కపూర్ ప్రియా సచ్దేవ్ కంటే ముందే ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీని, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ని వివాహం చేసుకుని విడిపోయారు.