28-09-2025 06:56:10 PM
కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దంటున్న వైద్యులు
అజాగ్రత్తతో ఉండి ప్రాణాలు కోల్పోవద్దు
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి(52) రేబిస్ వ్యాధి బారిన పడి శనివారం మృతి చెందింది. గత మూడు నెలల కిందట కాలనీలో తిరుగుతున్న కుక్క గోర్లు గీరడం రేబిస్ వ్యాధి రావడం.. అది మరింత తీవ్రతరం కావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఒంటరైన కుమారుడు...
చాకలి లక్ష్మి, నాగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు(16) సంతానం. తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించడంగా కుటుంబ పెద్ద లేక కష్టాల్లో ఉన్న ఇంట్లో రేబిస్ రూపంలో మరో కష్టం వచ్చి పడింది. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ఆ కుమారుడు ఒంటరి వాడయ్యాడు. కూతురుకు ఈమధ్యే వివాహం అయింది. తండ్రి గుండెపోటుతో తల్లి కుక్క కాటుతో మృత్యువాత పడగా కుమారుడు ఒంటరి వాడవ్వడం అందరినీ కలిచి వేస్తోంది.
ప్రాణాలు తీస్తోన్న పసరు మందు
కుక్క కాటు వేసినచో వెంటనే టీకా తీసుకోవాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది అవగాహన లేక పసరు మందులకు మొగ్గు చూపుతున్నారు. కుక్క కాటును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రాణాంతకమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
కుక్క కాటుకు తప్పనిసరిగా టీకా.. -డా. ప్రదీప్ రావు
కుక్క కాటు వేయగానే బాధితులు టీకాను తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టీకాను ఉచితంగానే ఇస్తున్నాం. పసరు మందులను నమ్మకండి. టీకా వేసుకొని ప్రాణాలను రక్షించుకోండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుంది.