29-07-2025 07:54:01 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా భక్తిమయ వాతావరణంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ ముత్యాల పోచమ్మ ఆలయంలో మహిళ భక్తుల సందడితో కళకళలాడింది. ఉదయం నుండి మహిళ భక్తులు ఆలయానికి చేరుకుని, నాగదేవతలకు పాలు, జొన్న ప్యాలలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శోభాయమానంగా అలంకరించబడి, భక్తుల ఆరాధనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్త్రీ, పురుషులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని, నాగదేవతల ఆశీస్సులు పొందేందుకు పుష్పాలు, పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. స్థానికులు ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా శాంతి, సౌభాగ్యాలను కోరుకున్నారు.