20-12-2025 07:34:35 PM
అదనపు కలెక్టర్ అంకిత్
నిజామాబాద్,(విజయక్రాంతి): వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన “మీ డబ్బు – మీ హక్కు” శిబిరంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ నెల 1వ తేదీ నుండి ప్రస్తుత డిసెంబర్ 31వ తేదీ వరకు “మీ డబ్బు – మీ హక్కు” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగితున్నారు. ప్రజలు తమకు చెందవలసిన అన్ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు మొదలైన ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతోందని తెలిపారు.
అన్క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు ధృవీకరణ పత్రాలతో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్ సైట్ (http://udgam.rbi.org.in) ద్వారా తెలుసుకుని సులభంగా పొందవచ్చని అన్నారు. ఈ శిబిరంలో ఆర్.బీ.ఐ ఎల్.డీ.ఓ ఎస్.రాములు, ఎస్.ఎల్.బీ.సీ మేనేజర్ ప్రకాష్, ఎస్.బీ.ఐ ఆర్.ఎం కే.మహేశ్వర్, ఎ.జీ.ఎం రవికిరణ్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.