20-08-2025 07:19:01 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యుయస్పిసి స్టీరింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.వెంకట్, ఎం.సోమయ్యలు తెలిపారు. బుధవారం టియస్యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదు. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు.
పై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికి మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుయస్పిసి నిర్ణయించిందన్నారు. జులై 23, 24, 25 తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాలు అందజేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.